ప్రముఖ యాదవ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పష్టమైన హామీ వచ్చిన అనంతరం వంశీకృష్ణ.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం వుంది. గాజువాక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ బరిలో నిలిచే అవకాశాలు వున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలలకు ముందే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైపోయింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ గేమ్ స్టార్ట్ చేశారు. గెలవరు అనుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టేస్తున్నారు. వీరిలో ఆప్తులు, విధేయులు, బంధువులు వున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు కుటుంబంతో సహా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు తరలివస్తున్నారు. ఇంకొందరు నేతలైతే జగన్ వేటు వేయడానికి ముందే వైసీపీనీ వీడుతూ .. తమ దారి ముందే సెట్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ యాదవ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పష్టమైన హామీ వచ్చిన అనంతరం వంశీకృష్ణ.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం వుంది. గాజువాక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ బరిలో నిలిచే అవకాశాలు వున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనసేనాని పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు.

యాదవ సామాజికవర్గంలో మంచి పట్టున్న శ్రీనివాస్ విశాఖ తూర్పు ఎమ్మెల్యే టికెట్, విశాఖ మేయర్ పదవిని ఆశించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయనకు మొండిచేయి ఇచ్చింది. నాటి నుంచి అసంతృప్తితో వున్న వంశీకృష్ణ పార్టీని వీడుతారని ప్రచారం నడిచింది. విశాఖ మేయర్ ఎన్నిక సమయంలోనే శ్రీనివాస్ వర్గం రచ్చ రచ్చ చేసింది. అయితే పార్టీ పెద్దలు బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. 

వంశీకృష్ణ గతంలో విశాఖ తూర్పు నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన పోటీ చేశారు. అయితే జనసేనలో చేరి గాజువాక నుంచి పోటీ చేయాలని వంశీ కృష్ణ పట్టుదలతో వున్నారు. అయితే ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో యాదవులతో పాటు పవన్ సొంత సామాజిక వర్గ ప్రాబల్యం కూడా అధికంగానే వుంది. పొగొట్టుకున్న చోటే తిరిగి పొందాలనే ఉద్దేశంతో పవన్ వున్న నేపథ్యంలో గాజువాక టికెట్ వంశీకి దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి వుంది.