గర్భిణిని కాలితో తన్ని... వైసిపి గూండాల కిరాతకం: అచ్చెన్నాయుడు
గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో రోజా అనే మహిళ గర్భంతో వుండగా వైసీపీ గూండాలు ఆమె కడుపుపై తన్ని అత్యంత కిరాతకంగా వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: అధికార అండతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా వైసీపీలో మాత్రం ఓటమి బాధ ఇంకా తొలగలేదన్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో రోజా అనే మహిళ గర్భంతో వుండగా వైసీపీ గూండాలు ఆమె కడుపుపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె భర్త గుడె రామారావు వైసిపిని చిత్తుచేసి 590 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించాడాన్న అక్కసుతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని అచ్చెన్న ఆరోపించారు.
''పెట్టుబడుల వీణ మోగాల్సిన రాష్ట్రంలో దౌర్జన్యం, దమనకాండ పెల్లుబుకుకోంది. ఓటమిని అంగీకరించలేని వైసీపీ నాయకులు దాడికి తెగబడిందిగాక తిరిగి మా కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. గర్భిణీపై వైసీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తున్నా. ప్రజా మద్ధతుతో గెలిచిన వారిపై దాడికి పాల్పడటం సిగ్గుచేటు. మీరు గెలిచిన చోట మా కార్యకర్తలు ఏమైనా దాడుల చేశారా? వైసీపీ క్రూరత్వం కొత్త పుంతలు తొక్కుతోంది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
''ప్రజలు తమ సమస్యను చెప్పుకునే పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మహిళల రోధన మీ కంటికి కనిపించడం లేదా? వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్యనున్న గురుత్వాకర్షన శక్తి తొలగాలి. లేదంటే ప్రజలే మీ శక్తిని నశింపజేస్తారు. మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చినా ప్రయోజనం ఏంటి? మహిళా కమిషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మహిళలంతా కేసు పెట్టాలి. దిశ చట్టం పనిచేస్తుందా జగన్ రెడ్డి?'' అని ప్రశ్నించారు.
''ఏపీని చూసి తమ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు బాగున్నాయని బీహార్ భావిస్తోంది. అన్నొచ్చాడు.. అరాచకం సృష్టిస్తున్నాడని రాష్ట్రం మొత్తం భయపడుతోంది. 23 నెలల్లో ఎవరికి రక్షణ కల్పించారో సమాధానం లేదు. తండ్రిని కోల్పోయిన చెల్లికి జరుగుతున్న అన్యాయంతోనే రాష్ట్రంలో మహిళలకు భరోసా లేదని అర్థమైంది. ఏం జరుగుతున్నా పట్టించుకోని గుడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే'' అని మండిపడ్డారు.
''మహిళలకు స్వేచ్ఛగా వెళ్లి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునే స్థితి వుందా? మహిళల మాన, ప్రాణాలకు రక్షణ వుందా? కనీసం ఇప్పటికైనా తీరుమార్చుకుని మహిళలను కాపాడాలి. ఆడిబిడ్డల ఉసురు తగిలితే పుట్టగతులుండవు. 23 నెలలుగా మహిళలను కంట కన్నీరు మాత్రమే మిగిల్చారు. వచ్చే ఎన్నికల్లో మహిళల ఆగ్రహంతోనే వైసీపీ కనుమరుగు అవుతుంది'' అని అచ్చెన్న హెచ్చరించారు.