Political war: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు !
MP Keshineni Srinivas: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్లు కేశినేని నాని ప్లేస్లో తన సోదరుడైన కేశినేని శివనాథ్ (చిన్ని)ని చేరదీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది విజయవాడ ఎంపీ కేశినేని ఇంట్లో రాజకీయ చిచ్చు పెట్టినట్టు సమాచారం.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రచ్చ రేపుతున్నాయి. అధికార వైకాపాతో పాటు ప్రతిపక్ష పార్టీలలో సైతం చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయ కాకరేపుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పలువురు నేతలు బహాటంగానే వైకాపా అధినేతపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు కొత్తగా మంత్రులైన వారిని పెద్దగా పట్టించుకోని నేతల తీరు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గోడదూకినవారితో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరింత డీలా పడింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు టీడీపీని బలోపేతం చేయడానికి.. రానున్న ఎన్నికల్లో పొత్తులు వంటి కీలక అంశాలపై ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే, టీడీపీ మహానాడు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఇంట్లో రాజకీయ కుంపటికి కారణమైందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగినట్లు టీడీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణంగా ఎంపీ నానికి బదులు ఆయన తమ్ముడికి ప్రాధాన్యత ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నాలు చేయడమేనని సమాచారం. దీనికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్లు కేశినేని నాని ప్లేస్లో తన సోదరుడైన కేశినేని శివనాథ్ (చిన్ని)ని చేరదీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది విజయవాడ ఎంపీ కేశినేని ఇంట్లో రాజకీయ చిచ్చు పెట్టినట్టు తెలిసింది.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం నగరంలోని ఆటోనగర్ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలు కేశినేని డెవలపర్స్ పేరిట జరిగాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పార్టీ నేతలకు సంబంధించి హోర్గింగులు కేశినేని కుటుంబంలో రాజకీయ వార్ నడుస్తున్న తీరును బహిర్గతం చేసిందనే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించి హోర్డింగ్ లు వెలిశాయి. అయితే, ఆ హోర్డింగులు, పోస్టర్లలో టీడీపీ వ్యవస్థాపకుడైన∙ఎన్టీ రామారావు, ఆపార్టీ జాతీయ అధ్యక్ష చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ లతో పాటు పాటు కేశినేని శివనాథ్ (చిన్ని) ఫొటోలు మాత్రమే ఉన్నాయి. వాటిలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఫొటోలు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, విజయవాడ ఎంపీ కేశినేనికి రాజకీయంగా చెక్ పెట్టడానికి అధిష్టానం పావులు కదుపుతోందనే అనుమానాలను నాని అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నానికి, నగరంలోని సీనియర్ నాయకుల మధ్య జరిగిన బహిరంగ మాటల యుద్ధం తెలిసిందే. అలాగే, జిల్లా పార్టీలో చోటుచేసుకున్న పలు పరిణామాల సమయంలో కేశినేనితో చంద్రబాబు అంటీముట్టనట్లు ఉంటున్నారు. తన లోక్సభ నియోజకవర్గం పరిధిలోని దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా, తంగిరాల సౌమ్య, పట్టాభి తదితరులకు ఎంపీతో పొసగకపోవడం తెలిసిందే.