దారుణం.. గుర్తించలేని స్థితిలో మృతదేహం
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి... శవాన్ని కాల్చేశారు. కాగా.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి... శవాన్ని కాల్చేశారు. కాగా.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే... హత్యకు గురైంది... మహిళా, పురుషుడా అన్న విషయం గుర్తించడం కూడా కష్టంగా మారడం గమనార్హం. అంత దారుణంగా శవం కాలిపోయి ఉంది.
మడకశిర మండలం ఉప్పిడిపల్లి గ్రామ సమీపంలోని కురుబ సిద్ధప్పకు చెందిన బీడు భూమిలో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. ఈకంపచెట్ల మధ్య పాడుబడిన 20 అడుగుల లోతు గల బావి ఉంది. ఈ బావి పేరు సర్కార్ బావి. పూర్తిగా ఎండిపోయి ఉన్న ఈ బావిలో మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహం నడుం భాగం పూర్తిగా కాలి పోయింది. బోర్ల పడి ఉన్న మృతదేహం పక్కనే పెట్రోల్ క్యాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మృతదేహాన్ని బావి గట్టుపై కాల్చి, మళ్లీ బావిలోకి తోసి వేసి మరోసారి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించారు. కర్ణాటక ప్రాంతంలో హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి కాల్చి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.