పోలీసులను దూషించారు:టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు. తమను దూషించారని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
అనంతపురం: అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు. తమను దూషించారని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 4వ తేదీన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు దీక్ష చేస్తామని ప్రకటించారు.
ఈ దీక్ష స్థలానికి వెళ్లకుండా జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు సోమవారం నాడు అడ్డుకొన్నారు. ఈ సమయంలో తమను జేసీ దివాకర్ రెడ్డి దూషించారని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.
జేసీ దివాకర్ రెడ్డి తీరుపై డిఎస్సీ శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుల ఫిర్యాదు మేరకు పెద్దపప్పూర్ పోలీస్ స్టేషన్ లో జేసీ దివాకర్ రెడ్డిపై మంగళవారం నాడు కేసు నమోదైంది. 353, 505 సెక్షన్ల కింద జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లి జేసీ అనుచరులపై దాడికి దిగారు. ఈ ఘటన తర్వాత జేసీ వర్గీయులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులకు మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది.