పోలవరం నిర్మాణం .. ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ కీలక వ్యాఖ్యలు
2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఏపీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి. అడహక్ నిధుల కింద ఏపీ ప్రభుత్వం రూ.17,414 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిందని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఏపీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్ట్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూ వివరాలను నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనుకున్న సమయానికంటే ఏడాది ముందుగానే ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
అడహక్ నిధుల కింద ఏపీ ప్రభుత్వం రూ.17,414 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిందని ఆయన తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందని.. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వాలని కూడా కోరామని.. దీనిపైనా కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే.. గత శనివారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే.