రామచంద్రాపురం స్థానం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన ప్రాతినిథ్యం వహిస్తూ వుండగా.. ఆయనకు బదులుగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్కు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలవరు అని సర్వేల్లో తేలితే చాలు నో టికెట్ అని చెప్పేస్తున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు నేతల తాకిడి పెరిగింది. అధినేతను ఎలాగైనా ప్రసన్నం చేసుకుని తమ సీటు కాపాడుకోవాలని సిట్టింగ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో పలువురు మంత్రులు కూడా వున్నారు. కానీ జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడం జరగని పని.
ఇకపోతే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల జాబితా దాదాపుగా ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 స్థానాలకు గాను 11 మంది సిట్టింగ్లను కొనసాగిస్తూ వుండగా.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పిఠాపురం(పెండెం దొరబాబు), పి.గన్నవరం(కొండేటి చిట్టిబాబు), జగ్గంపేట(జ్యోతుల చంటిబాబు), ప్రత్తిపాడు(పర్వత ప్రసాద్)ల స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ.
వీటన్నింటిలోకి రామచంద్రాపురం స్థానం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన ప్రాతినిథ్యం వహిస్తూ వుండగా.. ఆయనకు బదులుగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్కు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బట్టి చూస్తే బోస్ .. జగన్ వద్ద తన పలుకుబడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నట్లయ్యింది.
నిజానికి రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ , మంత్రి చెల్లుబోయిన తీవ్రంగా ప్రయత్నించారు. కొద్దినెలల క్రితం ఇద్దరూ హోరాహోరిగా తలపడటంతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఒకదశలో మంత్రి వేణుకు కనుక టికెట్ ఇస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తాను కానీ, తన కుమారుడు సూర్యప్రకాష్ కానీ స్వతంత్రంగా పోటీకి దిగుతామని హెచ్చరించారు.
వైసీపీ నిర్మాణం నుంచి తన వెన్నంటి వున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, 30 ఏళ్లుగా ఈ కేడర్ కృషితోనే తాను ఈ స్థాయికి ఎదిగానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. అలాంటి కేడర్కు అన్యాయం జరుగుతున్నా చూస్తూ భరించానని, కానీ ఇప్పుడు పునాదులే కదిలిపోతుంటే ఎలా ఊరుకుంటానని ఆయన చెప్పారు. జగన్ తనకు ఎటువంటి అన్యాయం చేయలేదని, కార్యకర్తల అభీష్టం మేరకు తాను నడుచుకుంటానని బోస్ తెలిపారు. ఇద్దరినీ కలిసి కూర్చోబెడతామని జగన్ అన్నారని, తాను వేణుతో కలిసి కూర్చోలేనని బోస్ తేల్చిచెప్పేశారు.
అటు మంత్రి వేణు సైతం తన టికెట్ విషయంలో ధీమాగానే కనిపించారు. రోజురోజుకు విషయం ముదరుతూ వుండటంతో జగన్ జోక్యం చేసుకున్నారు. మంత్రి వేణు, పిల్లి , ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మిథున్ రెడ్డిని తాడేపల్లి పిలిపించి మాట్లాడారు. టికెట్ విషయం తనకు వదిలేసి పార్టీ విజయం కోసం శ్రమించాలని సూచించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ , సర్వే, పిల్లి సుభాష్ చంద్రబోస్తో వున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కే జగన్ టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు మంత్రి వేణు ఓకే చెబుతారో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే రామచంద్రాపురంలో రాజకీయం వేడిగానే వుంది.
