మొన్న మెడికో ప్రీతి, నిన్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యలు మరిచిపోకముందేే తెలుగురాష్ట్రాల్లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పిహెచ్డి విద్యార్థి వసతిగృహంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అనంతపురం :తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.చదువుల ఒత్తిడి, వేధింపులు, ర్యాంగింగ్, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు... ఇలా కారణమేదైనా బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. కాలేజీ, హాస్టల్లు, యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో మెడికో ప్రీతి, ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యలు మరిచిపోకముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. రాయలసీమలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం శేషానుపల్లి గ్రామానికి చెందిన అంజి ఉన్నత విద్యావంతుడు. మ్యాథ్స్ లో ఎమ్మెస్సీ పూర్తిచేసిన అతడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడు.ఏమయ్యిందో తెలీదుగానీ వసతి గృహంలోని తన గదిలో ఒంటరిగా వున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అంజి.తోటి స్టూడెంట్స్ సకాలంలో గుర్తించి అంజిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
Read More శ్రీచైతన్య కాలేజ్లో మరో ఘటన.. ఖమ్మంలో బిల్డింగ్ పైనుంచి దూకిన విద్యార్ధిని , పరిస్ధితి విషమం
అంజి ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హాస్పిటల్ కు చేరుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.
ఉన్నతచదువులు చదువుతూ చేతికందివచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావుబ్రతుకులతో పోరాడటం చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎలాగయినా తమ బిడ్డను కాపాడాలంటూ డాక్టర్లను వేడుకుంటున్నారు. పరిశోధక విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే తెలంగాణలో కార్పోరేట్ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ శివారులోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునే సాత్విక్ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.సాత్విక్ ఆత్మహత్యకు చదువుల పేరిట కాలేజీ సిబ్బంది ఒత్తిడే కారణమంటూ బాధిత కుటుంబంతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వివాదాస్పదమయ్యింది.
మూడ్రోజుల క్రితం మహబూబ్ నగర్ మణికొండలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీ విద్యార్ధి శివకుమార్ ఆత్మహత్య చేసుకన్నాడు.ఇంటర్ చదివే శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. శివకుమార్ అంత్యక్రియలు హడావుడిగా నిర్వహించారు. దీంతో కాలేజీ ముందు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.
