రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం నివేదిక.. 85 పేజీలతో రిపోర్టు సిద్దం చేసిన భూమన నేతృత్వంలోని కమిటీ..
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వ్యక్తుల డేటా చౌర్యం ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక రేపు అసెంబ్లీ ముందుకు రానుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వ్యక్తుల డేటా చౌర్యం ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశం అయింది. తాజాగా నేడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ మరోమారు సమావేశం అయింది. అయితే గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగినట్టుగా కమిటీ నిర్దారణకు వచ్చింది. రేపు (సెప్టెంబర్ 20) అసెంబ్లీలో కమిటీ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. 85 పేజీలతో కూడిన నివేదికను అసెంబ్లీ హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శాసనసభ ముందు ఉంచనున్నారు.
గతంలో ఇందుకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తమ వద్ద ఉన్న వ్యక్తుల డేటాను ప్రైవేట్ ఏజెన్సీలతో పంచుకుందని చెప్పారు. ఈ మేరకు తాము దాదాపుగా ఒక అంచనాకు వచ్చామని తెలిపారు. ఈ వ్యవహారపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజల డేటాను దొంగిలించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పిన భూమన కరుణారెడ్డి.. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజల నుంచి డేటాను సేకరించి, వ్యతిరేకులని తేలిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించిందన్నారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు అంశాన్ని కొందరు ప్రజాప్రతినిధులు లేవనెత్తినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కమిటీ డేటా లీక్పై మాత్రమే విచారణ చేసి తన నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తుంది అని స్పష్టం చేశారు. తర్వాత సమగ్రంగా చర్చించిన అనంతరం శాసనసభ తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.