పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం హైదరాబాద్ ఇంటి వద్దే ఉంటూ.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నలెజినోవా తిరుపతికి వచ్చి మొక్కు కూడా చెల్లించుకున్నారు. అయితే... సింగపూర్ అగ్నిప్రమాదం వల్ల పవన్ కుమారుడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కాస్త ఇబ్బందికి గురయ్యాడు.
డిప్యూటీ సీఎం పవన్ ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా తీవ్రవాదుల కాల్పుల్లో అన్యాయంగా చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితిని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగి సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ .. ఇప్పటికీ ఆ ఘటన నుంచి శంకర్ తేరుకోలేదని అన్నారు పవన్.
ఇప్పటికే రాత్రి వేళ్ల నిద్రలో లేచి.. బిల్డింగ్ పైనుంచి పడిపోయినట్లు తన కుమారుడికి కలలు వస్తున్నాయని దీన్ని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇదే విధంగా పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో అయిన వారు కళ్లముందే చనిపోతుంటే.. కుటుంబ సభ్యులు ఎంత భయానకంగా ఫీలయ్యారో ఊహించలేకపోతున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బహుశా ఆ పీడకలలో నుంచి అనేక కుటుంబాలు బయటకు రాలేదని అలాంటి వారందరికీ తోటి వారు ధైర్యం చెప్పాలని, అండగా ఉండాలని పవన్ కల్యాణ్ కోరారు.