నేను మద్దతు ఇవ్వకుంటే..జగనే సీఎం అయ్యేవారు.. పవన్
సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను టీడీపీకి మద్దతు ఇవ్వకుంటే... జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని పవన్ పేర్కొన్నాడు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను అని, తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నాని పవన్ అన్నారు.
మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సౌభాగ్య సెంటర్ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు.
సేంద్రీయ వ్యవసాయానికి అమెరికా వెళ్లి రూ.వేల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు ఆ అప్పును ఎవరు తీరుస్తారో చెప్పాలని పవన్ అంటూ.. మీ అబ్బాయి కడతారా? అని ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు బాండ్లు ఇచ్చినట్టుగానే పోలవరం రైతులకూ బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యం తినడానికి పనికి రావని, సారా కాయడానికి, మొలాసిస్ తయారు చేయడానికి పనికొస్తాయన్నారు. టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పారు.