జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి తనపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. 

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి తనపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. 

తాను చేతులు కట్టుకుని కూర్చోనని తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని స్పష్టం చేశారు. 

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరు సందర్శించినప్పుడు లేని ఆంక్షలు తాను వచ్చినప్పుడే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

 కొల్లేరులో యాత్రకు కట్టుబాట్లు విధించడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని తానంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని ఆరోపించారు.

మరోవైపు తాను సీఎం అయితే రూ.110 కోట్లతో కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపించకపోయినా పర్వాలేదు గానీ, తన వెనక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు పవన్.