అలా ఉంటే టీడీపీని ఎప్పుడో దించేసేవాడిని: పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తున్న పవన్ తన కులంపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను బీజేపీతో దోస్తి కట్టానని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని పవన్ ఖండించారు.
దేవరపల్లి: తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తున్న పవన్ తన కులంపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను బీజేపీతో దోస్తి కట్టానని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని పవన్ ఖండించారు. తాను బీజేపీతో దోస్తి కడితే టీడీపీని ఎప్పుడో దించేసేవాడినని చెప్పుకొచ్చారు.
మరోవైపు మాదిగలకు పెద్దమాదిగను అవుతానని ఎన్నికల్లో పదేపదే చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు...ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదే కులం పేరుతో బూతులు తిట్టడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు తన కులం ఏ టీడీపీ నేతకు గుర్తుకు రాలేదని అయితే ప్రశ్నించడం మెుదలుపెట్టిన తర్వాత మాత్రం తన కులం గుర్తుకు వస్తుందా అని ఎద్దేవా చేశారు.
తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిడుతుంటే మంత్రి జవహర్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. అసలు జవహర్ కు పౌరుషం ఉందా అంటూ నిలదీశారు.