Janasena: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన.. కాకినాడ నుంచి పోటీ చేసేది ఎవరంటే?
పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగే జనసేన అభ్యర్థిని ప్రకటించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు కీలక ప్రకటన చేశారు. కాకినాడ లోక్ సభ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని తెలిపారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం జనసేన పార్టీ, టీడీపీ,బీజేపీతో కలిసి పోటీకి దిగుతున్నది. కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో బరిలో దిగుతున్నది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల నుంచి పోటీకి దిగి రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా, కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన తరఫున ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకటించారు. పిఠాపురం నుంచి తనను, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని ఆయన కోరారు.