Asianet News TeluguAsianet News Telugu

Vijayawada లో హృదయవిధారకం : కన్నబిడ్డల విషాన్ని కూడా నువ్వే తాగేసి... ఎంతపని చేసావు తల్లీ ..!

  గోరుముద్దలు పెట్టిన చేతులతోనే కన్న బిడ్డలకు విషం ఇవ్వాల్సిరావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తన చేతులతో వారిని చంపలేక తానే విషంతాగి ప్రాణాలు వదిలింది. 

Parents Commits suicide in front of Childrens in Vijayawada AKP
Author
First Published Jan 10, 2024, 11:42 AM IST

విజయవాడ: నవమాసాలు కడుపున మోసిన కన్నబిడ్డల ప్రాణం తీసేందుకు ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. ప్రాణం పోసిన చేతులతోనే ప్రాణం తీయలేక తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. దీంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దంపతులు చివరికి వారిముందే విషంతాగారు. పిల్లలతో తాగించేందుకు రెడీ చేసిన విషం కూడా తానే తాగేసి ఆ తల్లి తనువు చాలించింది. ఈ హృదయవిధారక ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడ శాంతినగర్ లో ప్రతాప్ కుమార్, సాయికన్య దంపతులు నివాసముండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఈ దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోడానికి సిద్దమయ్యారు. కానీ కన్న బిడ్డలను చంపడానికి ఆ తల్లి వెనకాడి తన ప్రాణాలు  తీసుకుంది. 

చీటీల పేరుతో రూ.20 లక్షల వరకు అప్పు కావడం ... అవి తీర్చే మార్గంలేక ప్రతాప్, కన్య దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(మంగళవారం) సాయంత్రం కూల్ డ్రింక్  లో పురుగుల మందు కలిపుకుని కుటుంబంమొత్తం ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారు. నాలుగు గ్లాసుల్లో విషం కలిపిన కూల్ డ్రింక్ పోసుకుని ముందుగా ప్రతాప్ తాగినట్లున్నాడు. ఆ తర్వాత బిడ్డలకు కూల్ డ్రింక్ తాపి తాను తాగాలనుకున్నట్లుంది సుకన్య. కానీ పిల్లలకు విషం ఇవ్వలేకపోయిన ఆ తల్లి మూడు గ్లాసుల్లోని విషపూరిత కూల్ డ్రింక్ ను తానే తాగేసింది. 

Also Read  ఏం జరిగిందో.. చాక్లెట్లు తిని, వింతంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..!

తల్లిదండ్రులు తమ కళ్లముందే పడిపోగా ఏమయ్యిందో తెలియక వారిని లేపేందుకు ప్రయత్నించారు ఆ పసివాళ్ళు. కానీ ఎంతకూ వాళ్లు లేవకపోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇరుగుపొరుగు ఇళ్లవారికి తల్లిదండ్రులు లేవడంలేదని అమాయకంగా చెప్పారు. వారు వెళ్లిచూడగా అప్పటికే సాయికన్య ప్రాణాలు కోల్పోగా ప్రతాప్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని దగ్గర్లోని  హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
దంపతుల ఆత్మహత్యలపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. సాయికన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

తల్లి చనిపోయిందని తెలియని ఆ పసివాళ్లు మృతదేహంవద్ద ఏడవడం అక్కడున్నవారితో కన్నీరు తెప్పిస్తోంది. ఈ ఘటనతో శాంతినగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios