అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులు చితకబాదారు. విద్యార్థినులతో లైబ్రేరియన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు.

అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ భానుప్రకాష్ విద్యార్థినుల తల్లిదండ్రులు చితకబాదారు. విద్యార్థినులతో లైబ్రేరియన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాము ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నట్టుగా తెలిపారు. అయితే విద్యార్థినుల తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయానికి వచ్చి.. లైబ్రేరియన్‌‌ను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి గొడవ జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని.. లైబ్రేరియన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే లైబ్రేరియన్ మాత్రం.. తాను విద్యార్థులను అసభ్యంగా తిట్టలేదని చెబుతున్నాడు. వారు కూడా తన పిల్లలలాంటి వారేనని చెప్పాడు. తాను ఎంతోకాలంగా విధుల్లో ఉన్నానని.. తనపై ఎప్పుడూ ఇలాంటి ఫిర్యాదు లేదని తెలిపాడు. 

విద్యార్థినుల తల్లిదండ్రుల మాట్లాడుతూ.. విద్యార్థులతో మసాజ్‌లు చేయించుకోవడం, కాళ్లు నొక్కమనడం, ఇంట్లో వాళ్ల వివరాలు అడుగుతున్నాడని.. అసభ్యకరంగా మాట్లాడటం, పిల్లల లోదుస్తుల కలర్ కూడా అడుగుతున్నాడని ఆరోపించారు. ఏదైనా మాట్లాడితే విద్యార్థులను ఐరన్ స్కేలుతో కొడుతున్నారని.. దీంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని చెప్పారు. ప్రైవేట్ పార్ట్స్‌లో టచ్ చేస్తున్నారని.. ఇంట్లో చెబితే టీసీ ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

లైబ్రేరియన్ వికృత చేష్టలపై మూడు రోజుల క్రితమే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. అయితే ఈ విషయం తెలిసి లైబ్రేరియన్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.