తూ.గోదావరిలో విషాదం: కోడి కత్తి గుచ్చుకుని యువకుడి మృతి
తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడికత్తి గుచ్చుకొని పద్మారావు అనే యువకుడు మృతి చెందాడు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది. కోడి పందెల సందర్భంగా కోళ్లకు కట్టే కోడికత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు మృతి చెందాడు. కోళ్ల పెందెం నిర్వహిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటతో పద్మారావు అనే యువకుడికి కోడి కత్తి గుచ్చుకుంది. దీంతో పద్మారావు అక్కడిక్కడే మృతి చెందాడు.
పద్మారావుకు కోడికత్తి గుర్చుకోవడంతో అతడికి తీవ్ర గాయమైంది. ఈ గాయం నుండి రక్తం ధారగా పోయింది. పద్మారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకొనేలోపుగా పద్మారావు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. గాయం పెద్దది కావడంతో రక్తం ఎక్కువగా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ కారణంగానే పద్మారావు మృతి చెందినట్టుగా చెబుతున్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ఈ పందెలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశించింది. అయినా కూడా కోడిపందెలు నిర్వహించారు. కోడి పందెల నిర్వహణ సమయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా ప్రచారం సాగుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజుల పాటు కోడిపందెలు, గుండాట, ఎడ్ల పందెలు నిర్వహిస్తారు. కోడిపందెల కోసం ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేస్తారు.