Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో కర్నూలులో మరొకరు మృతి: ఏపీలో 16కు చేరిన మృతుల సంఖ్య

కరోనా వ్యాధితో కర్నూలులో మరొకరు మరణించారు. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది.

one more Corona death recorded in Kurnool: death toll in AP reaches 16
Author
Kurnool, First Published Apr 18, 2020, 7:25 PM IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధితో మరొకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 16కు చేరుకుంది. కర్నూలులో శనివారం ఉదయం కరోనాతో ఒకతను మరణించాడు. కర్నూలులోని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుంచి జీజీహెచ్ కు తరలిస్తుండగా అతను మరణించాడు. 

కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రిలో కొద్ది రోజులుగా ఆ 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి చికిత్స పొందుతూ వచ్చాడు. దీంతో కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒక్కసారిగా కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆత్మకూరులో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ఆత్మకూరులోని సత్రం సెంటర్ వద్ద ఉన్న ఓ కుటుంబం కారణంగా స్థానికులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.

ఆ కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ఇటీవల నెల్లూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు ఇటీవల చెన్నైలో మరణించిన వైద్యుడి ఇంటి పక్కనే ఉంది. అక్కడే వాళ్లు కొద్ది రోజులు ఉండి తిరిగి ఆటోలో ఆత్మకూరు సత్రం సెంటర్ వద్ద ఉన్న తమ ఇంటికి వచ్చారు. 

ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఇంట్లోనే బంధించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి, ఆ కుటుంబ సభ్యులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారి శాంపిల్స్ తీసుకుని తిరిగి ఇంటికి పంపించారు. శాంపిల్స్ కు సంబంధించిన నివేదిక వచ్చేవరకు ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు వారిని హెచ్చరించారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ నుంచి ఊరట లభించడం లేదు.  గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 31 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభించింది. కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కొత్తగా కర్నూలు జిల్లాలో ఐదు, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది ఇప్పటి వరకు 42 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 546 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

కరోనా వైరస్ కేసుల నమోదులో గంటూరు జిల్లాను కర్నూలు జిల్లా దాటేసింది. కర్నూలు జిల్లాలో 129 కేసులు నమోదు కాగా 126 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సున్నా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో మాత్రం కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా 20గానే కొనసాగుతోంది.

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మరణించారు. నెల్లూరులోనూ ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లాలో నలుగురు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది. 

అనంతపురం 26
చిత్తూరు 30
తూర్పు గోదావరి 19
గుంటూరు 126
కడప 37
కృష్ణా 70
కర్నూలు 129
నెల్లూరు 67
ప్రకాశం 44
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 35

Follow Us:
Download App:
  • android
  • ios