సారాంశం

కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ డేటాలో తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద మొత్తంలో మహిళలు, బాలికలు మిస్ అవుతున్నట్టు తెలిసింది. ఏపీ కంటే తెలంగాణలో ఈ సమస్య అధికంగా ఉన్నది. అలాగే.. మిస్ అవుతున్న మహిళల సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ రావడం ఆందోళనకరం. NCRB Data ఇలా ఉన్నది.
 

NCRB Report: కేంద్ర హోం శాఖ కనిపించకుండా పోయిన మహిళలు, బాలికల వివరాలను రాష్ట్రాల వారీగా తాజాగా ఎన్సీఆర్బీ నివేదికను విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో మహిళలు, బాలికలు కనిపించకుండా పోతున్నారని తెలిసింది. ఎన్సీఆర్బీ నివేదికలో 2019, 2020, 2021 సంవత్సరాల్లో మహిళలు, బలికల మిస్సింగ్ వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించకుండా పోతున్న మహిళల సంఖ్య యేటికి యేడు పెరుగుతున్నట్టు స్పష్టమైంది. ఏపీతో పోల్చితే తెలంగాణలో కనిపించకుండా పోయిన మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా..

18 ఏళ్ల లోపు వారిని బాలికలుగా, 18 ఏళ్లు పైబడినవారిని మహిళలగా ఈ రిపోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 2186 మంది బాలికలు, 6252 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2020లో 2374 బాలికలు, 7057 మహిళలు, 2021లో 3358 మంది బాలికలు, 8969 మంది మహిళలు మిస్ అయినట్టు ఎన్సీఆర్బీ డేటా తెలిపింది. ఈ మూడు సంవత్సరాల వివరాలను పరిశీలిస్తే.. కనిపించకుండా పోయిన బాలికల సంఖ్య, మహిళల సంఖ్య ప్రతి యేటా పెరిగినట్టు తెలుస్తున్నది. తెలంగాణలోనూ మహిళల సంఖ్య ఇలాగే పెరుగుతున్న పరిణామం ఉన్నది.

తెలంగాణలో ఇలా..

తెలంగాణలోనూ కనిపించకుండా పోతున్న బాలికలు, మహిళల సంఖ్య భారీగానే ఉన్నది. 2019 సంవత్సరంలో తెలంగాణలో 2840 మంది బాలికలు, 10744 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2020లో 2232 మంది బాలికలు, 10917 మంది మహిళలు మిస్ అయ్యారు. 2021లో 2994 మంది బాలికలు, 12834 మంది మహిళలు కనిపించకుండా పోయారు. తెలంగాణలో ఈ మూడు సంవత్సరాల్లో మహిళలు పది వేలకు తగ్గకుండా మిస్ కావడం విస్మయకరం.

టాప్ స్టేట్స్ ఇవే

మహిళలు, బాలికలు అత్యధికంగా కనిపించకుండా పోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో టాప్‌లో ఉన్నాయి. 2019లో మహారాష్ట్రలో 4579 మంది బాలికలు, 63167 మంది మహిళలు కనిపించకుండా పోయారు. 2020లో 4517 బాలికలు, 58735 మంది మహిళలు, 2021లో 3937 మంది బాలికలు, 56498 మంది మహిళలు మహారాష్ట్రలో మిస్ అయ్యారు. అదే మధ్యప్రదేశ్‌లో 2019లో 13315 మంది బాలికలు, 52119 మంది మహిళలు, 2020లో 11885 మంది బాలికలు, 52357 మంది మహిళలు, 2021లో 13034 మంది బాలికలు, 55704 మంది మహిళలు మిస్ అయ్యారు.

జాతీయ స్థాయిలో..

మొత్తంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో 2019లో 73509 మంది బాలికలు, 318448 మంది మహిళలు మిస్ అయ్యారు. 2020లో 71204 మంది బాలికలు, 320393 మంది మహిళలు, 2021లో 81462 మంది బాలికలు, 348168 మంది మహిళలు కనిపించకుండా పోయారు. దేశవ్యాప్తంగా చూసిన కనిపించకుండా పోతున్న మహిళల సంఖ్య ప్రతియేటా పెరుగుతూ పోయింది. 

అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోకెల్లా ఢిల్లీలో అత్యధికంగా ఈ సమస్య ఉన్నది. ఇక మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019లో 82084 మంది బాలికలు, 342168 మంది మహిళలు, 2020లో 79233 మంది బాలికలు, 344422 మంది మహిళలు, 2021లో 90113 మంది బాలికలు, 375058 మంది మహిళలు మిస్ అయ్యారు.

లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేస్తూ మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో దర్యాప్తులు, విచారణ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలకు ఉంటుందని ఈ రిపోర్టు విడుదల చేస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, కేంద్ర పర్భుత్వం కూడా మహిళల రక్షణ కోసం క్రిమినల్ చట్టాల్లో సవరణలు చేసిందని వివరించింది.