జనసేనతో పొత్తు వుందా, లేదా : క్లారిటీ లేకుండానే ఏపీ బీజేపీ తీర్మానం, సోము వీర్రాజు మౌనం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పొత్తులపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. జనసేనతో కలిసి వెళ్తామా లేదా అన్న దానిపై తీర్మానంలో క్లారిటీ ఇవ్వలేదు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, వచ్చే ఎన్నికలు, ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా చేసిన రాజకీయ తీర్మానంలో జనసేనతో పొత్తు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం చర్చకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలతో ఎలాంటి పొత్తు వుండదని అందులో తెలిపారు. కేవలం ప్రజలతోనే బీజేపీ పొత్తు వుంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో వైసీపీ అధోగతి పాలనపై పోరాటం చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడంపై ఇందులో దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. పొత్తు, ఎత్తులతో బీజేపీకి సంబంధం లేదని .. కేవలం భావ సారుప్యత కలిగిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని తీర్మానించారు.
మరోవైపు.. ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. అనంతపరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పొత్తులపై వారం రోజుల ముందు స్పష్టత వస్తుందన్నారు. కొత్త పొత్తులు కలిస్తే కొత్త వారితో కలిసి వెళ్తామని.. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.2014 కాంబినేషన్ ను కాలమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ బీజేపీతోనే ఉందన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు ను ఆహ్వానిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తులపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయన్నారు. ఓట్లు చీలకుండా ఉండాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు. తమ పార్టీకి బీజేపీ మధ్య మైత్రి ఉందని చెప్పారు.
ALso REad: కొత్త పొత్తులు కుదిరితే కలుస్తాం: పవన్ కళ్యాణ్
తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర గురించి కాలం చెబుతుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోనే ఉన్నారని..ఆయనంటే తనకు అపరిమితమైన గౌరవం ఉందన్నారు పవన్. తమ మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేనలో కన్నా చేరుతున్నారా అనే విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. ప్రతి 15 ఏళ్లకు ఒక్కసారి యువత బయటకు వస్తుందన్నారు. ఎక్కువ పార్టీలు రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. రాజకీయాల్లో కూడా మార్పు అవసరమన్నారు.