మంత్రి పెద్దిరెడ్డి ఇష్యూ: గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలువనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విషయంపై నిమ్మగడ్డ గవర్నర్ కు విన్నవించే అవకాశం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఈ రోజు, సోమవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలువనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూపైన, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడంపైన ఆయన గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉంది.
పెద్దిరెడ్డి రమాచంద్రా రెడ్డి ఎన్నికల అధికారులను బెదిరించారనే ఆరోపణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానిపై ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ తీవ్రంగా స్పందించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలెజేస్ కమిటీ దృష్టి పెట్టింది.
కాగా, రేపు మంగళవారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామాల్లో రేపు పోలింగు జరుగుతుంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం శానిటైజర్లు, మాస్కులు కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పర్యటించారు.
ఇదిలావుటే, ఆంధ్రప్రేదస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు మంగళవారం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడి గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ఎన్నికల అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి గృహనిర్బంధం విధిస్తూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మీడియాతో కూడా మాట్లాడవద్దని ఆయన ఆదేశించారు. అయితే, రామచంద్రారెడ్డి గృహనిర్బంధం ఆంక్షలను హైకోర్టు ఎత్తేసింది. అయితే, మీడియాతో మాత్రం మాట్లాడవద్దని తేల్చి చెప్పింది.