జైలుకు పంపిస్తాం: వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్టీటీ ఆగ్రహం
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీ వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్దంగా పనులు చేపడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేశారు. దానిపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా స్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్యం బోర్డును, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఆ తర్వాత విచారణనను జులై 12వ తేదీకి వాయిదా వేసింది.