నవజాతశిశువును గోనెసంచిలో పెట్టి వదిలేసిన అగంతకులు.. పందులు లాక్కెళుతుండడంతో...
ఆంధ్రప్రదేశ్లో గోనె సంచిలో నవజాత శిశువును వదిలేసి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. పందులు ఆ గోనెసంచిని లాక్కెళుతుండడంతో చిన్నారి ఏడుపులతో విషయం వెలుగుచూసింది.
ప్రకాశం జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును గోనెసంచిలో పెట్టి తాసిల్దార్ కార్యాలయం దగ్గర వదిలేసి వెళ్లారు. అది మగ శిశువు. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు దగ్గర కోన సంచిలో మగ శిశువు దొరికింది. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు లో చర్చనీయాంశంగా మారింది. శిశువును ఉంచిన గోనెసంచిని పందులు లాక్కెళ్తుండగా.. శిశువు ఏడవడంతో కార్యాలయంలోని సిబ్బందికి వినిపించాయి.
వెంటనే వారు బయటికి వెళ్లి పందులను తరిమికొట్టి.. గోనెసంచిలోని నవజాత శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న విఆర్వోలు రంగయ్య, అక్బర్ అలీ, వెంకట రామయ్యలు గోనే సంచిని పరిశీలించారు. నవజాత శిశువును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువుకు.. ఆసుపత్రి ఆర్ఎంవో రమణారెడ్డి, చిన్నపిల్లల వైద్యురాలు ప్రియదర్శిని ప్రధమ చికిత్స చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం ఒడిశాలో వెలుగు చూసింది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి నవజాత కుమార్తెకు విషపూరిత ఇంజక్షన్ను ఎక్కించిన ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పసికందును సోమవారం బాలాసోర్లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కానందున సూమోటుగా కేసు నమోదు చేస్తున్నామని బాలాసోర్ పోలీసు సూపరింటెండెంట్ సాగరిక నాథ్ తెలిపారు. సాగరిక మాట్లాడుతూ, "ప్రాథమిక విచారణలో వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు తేలింది.
"చందన్ మహానాగా నిందితుడిని గుర్తించారు. అతను ఆ శిశువు తాను తండ్రిని కాదని అనుమానించాడు... దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. గ్రామస్తులు ఈ విషయం మీద సమాచారం ఇవ్వడంతో చందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
చందన్, తన్మయిలకు గతేడాది వివాహమై మే 9న ఓ పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, తన్మయిని ఆమె అత్తమామలు నీలగిరి పోలీసు పరిధిలోని సింఘిరి గ్రామంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు.
చందన్ సోమవారం తన అత్తమామ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పాప ఏడుపు విన్న తన్మయి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి చూడగా భర్త చేతిలో సిరంజి, క్రిమిసంహారక బాటిల్ కనిపించాయి.
ఆమె తన భర్తను నిలదీయగా, మొదట అతను ఎటువంటి తప్పు చేయలేదని తిరస్కరించాడు, కాని తరువాత నవజాత శిశువుకు పురుగుమందును ఇంజెక్ట్ చేసినట్లు అంగీకరించాడని తన్మయి చెప్పారు. ‘‘నా బిడ్డ, భర్త చేతుల్లో రక్తపు ఆనవాళ్లు కనిపించాయి’’ అని చెప్పింది.
వెంటనే ఆ మహిళ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పసికందును సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. శిశువు పరిస్థితి విషమించడంతో గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్లోని ఆసుపత్రికి తరలించారు.