బాబుతో నెల్లూరు జడ్పీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి భేటీ:త్వరలో టీడీపీలోకి
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం సింహపురి రాజకీయాల్లో హట్ హట్ గా మారింది.
అమరావతి: నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం సింహపురి రాజకీయాల్లో హట్ హట్ గా మారింది.బొమ్మిరెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరే అవకాశం ఉంది.మంగళవారం నాడు బాబుతో రాఘవేంద్రరెడ్డి అమరావతిలో సమావేశమయ్యారు.
బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీలో కొనసాగారు. అయితే తనకు తెలియకుండానే ఆనం రామనారాయణరెడ్డిని తన నియోజకవర్గంలో ఇంచార్జీగా ప్రకటించడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని టీడీపీలోకి రప్పించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా నేతలతో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తనకు మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు.
టీడీపీలోకి వస్తే... అన్ని రకాలుగా న్యాయం చేస్తానని చంద్రబాబునాయుడు బొమ్మిరెడ్డికి హామీ ఇచ్చినట్టు సమాచారం. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా పర్యటించాలని ఆయన బొమ్మిరెడ్డిని కోరారు. త్వరలోనే బొమ్మిరెడ్డి టీడీపీలో చేరనున్నారు. పార్టీలో చేరే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.