Asianet News TeluguAsianet News Telugu

నా పేరు విన్నా, నా ఫోటో చూసినా ఎందుకంత భయం : ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి కౌంటర్

తనపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. నేదురుమల్లి పేరు విన్నా.. తన ఫోటో చూసినా నీకెందుకు భయమని ఆయన సెటైర్లు వేశారు. 

nedurumalli ramkumar reddy counter to venkatagiri ysrcp mla anam ramanarayana reddy
Author
First Published Dec 30, 2022, 8:04 PM IST

వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం మంచి వ్యక్తని పవన్ కల్యాణ్ ఎందుకన్నారని ఆయన ప్రశ్నించారు. నేదురుమల్లి పేరు విన్నా.. తన ఫోటో చూసినా నీకెందుకు భయమని రాంకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మున్సిపాలిటీలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఓడిపోయినా వెంకటగిరి వదిలిపోలేదని నేదురుమల్లి చురకలంటించారు. మీరు టీడీపీలో చేరి ఆత్మకూరులో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారని రాంకుమార్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని.. వివేకానంద రెడ్డి జయంతిని అట్టహాసంగా జరిపారని ఆయన వ్యాఖ్యానించారు. ఎదుటివాళ్లపై మాట్లాడటం కాదని.. మీరు ఏం ఇరగదీశారో చూసుకోవాలంటూ రాంకుమార్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 

కాగా.. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కలకలం రేపుతున్నారు వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. శుక్రవారం ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. తాను వాస్తవాలే మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా మాట్లాడినట్లు ఆనం పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్ట్‌లే పూర్తి కాలేదని రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతానన్నది ఊహాగానాలేనని రామ నారాయణ రెడ్డి కొట్టిపారేశారు. తన గురించి బాతు బచ్చాగాళ్లు మాట్లాడే మాటలు పట్టించుకోనని ఆయన తేల్చిచెప్పారు. కొందరు వెంకటగిరికి ఇన్‌ఛార్జ్‌గా వచ్చి పోటీ చేస్తామంటున్నారని.. ఇది చూసి తాను ఎమ్మెల్యేనేనని జనం అనుకుంటున్నారని ఆనం వ్యాఖ్యానించారు. 

ALso REad: బాతు బచ్చాగాళ్ల మాటలు పట్టించుకోను : ‘‘నేదురుమల్లి’’పై మరోసారి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు

ఇక నిన్న కూడా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలాజీ జిల్లా డక్కిలిలో గురువారం జరిగిన వైసీపీ సమన్వయ సమావేశంలో ఆనం మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేనో కాదో చెప్పాలంటూ ప్రశ్నించారు. వైసీపీ పరిశీలకుడి ఎదుటే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు కూడా అదే అనుమానం వుందని..నియోజకవర్గంలో సమన్వయ లోపం వుందని ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మరో ఏడాదిపాటు తానే ఎమ్మెల్యేగా వుంటానని.. కానీ ఒకరు మాత్రం తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆనం పేర్కొన్నారు. గతంలోనూ ఆయన ఇలాగే హడావుడి చేసి మధ్యలోనే పారిపోయారని రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇకపోతే.. బుధవారం కూడా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులిస్తోందని... అప్పుటు నీళ్లిస్తామని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లేమైనా కట్టామా... పనులు మొదలుపెట్టామా అని ఆయన నిలదీశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ఆనం ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పానని, లే ఔట్లు వేశామే కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios