Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ: పూర్తి పాఠం ఇదీ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోేకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆయన ఆ లేఖ రాశారు. 

Nara Lokesh writes letter to AP CM YS Jagan
Author
Amaravathi, First Published Apr 27, 2020, 5:14 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు కల్పించడం, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడం గురించి నారా లోకేష్ సోమవారం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. నారా లోకేష్ రాసిన లేఖ పూర్తి పాఠం కింద ఇస్తున్నాం, చదవండి.

 రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే ప‌ట్టించుకోవాల్సిన మీరు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారు కరువయ్యారు. మార్కెటింగ్  సదుపాయం లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా మొద్దునిద్ర నటిస్తున్నారా?  ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో.. అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. రైతులకు భరోసా ఇవ్వడంలో మీ ప్ర‌భుత్వం విఫల‌మైంది. రబీ సీజన్ లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా.. అందులో అరటిని నామ్ కే వాస్తేగా కేవలం 7వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రకటనలకు, కొనుగోలుకు ఎంత అగాధం ఉందో అర‌టిధ‌ర చూస్తే అర్థమ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రం రూ.30వేల కోట్ల రూపాయలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోంది. మీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? అరటి టన్ను లాక్ డౌన్ కు ముందు రూ.15,000 వరకు ఉండగా.. నేడు రూ.1000 నుంచి రూ.1500 కు కొనుగోలు చేస్తున్నారు. కర్భూజ టన్ను రూ.3 వేలకు కొంటున్నారు. టమోట కేజీ రూ.2కు కొంటున్నారు. కొబ్బరికాయ వంద కౌంట్ రూ.700కు కొంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదు.

లాక్ డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదు. రాష్ట్రంలో రబీ సీజన్ లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొగాకు, పసుపు, శనగ, మిర్చి, కంది ఇలా అనేక పంటలు ఉన్నాయి. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారు. ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇప్పటికీ ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లే పూర్తికాలేదు. రూ.300కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా? ఇప్పుడు రబీ సీజన్ లో పంట కోతకు వచ్చింది. మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉన్నాయి. వీటిని కొనే నాథుడే లేడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామన్న మీ హామి మాటలకే పరిమితం అయింది. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలి. 
       
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలి. వరితో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న, నువ్వు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరింది. తాత్సారం చేయకుండా ఆదుకోవాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిగా మీపై ఉంది

 నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Follow Us:
Download App:
  • android
  • ios