మీ పాలన చాలా చాలా చాలా ఘోరం...మొహం మీదే ఛీకొట్టినా చిద్విలాసమా: సీఎం జగన్ కు లోకేష్ లేఖ
కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బారాన్ని తగ్గిస్తూ పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిందని... ఇదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడిచి దేశంలోనే అత్యధికంగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించుకోవాలని నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాసారు.
మంగళగిరి: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించుకున్నా జగన్ సర్కార్ అత్యధిక పన్నులు విధిస్తూ రాష్ట్ర ప్రజలపై భారం మోపుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ పాలనలోని ఏపీలో దేశంలోనే ఎక్కడా లేనంత ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు వున్నాయిని పేర్కొన్నారు. ఈ బాదుడే బాదుడిని ఇకనైనా ఆపి పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాసారు.
వైఎస్ జగన్ కు లోకేష్ రాసిన లేఖ యదావిధిగా:
గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు.
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయం- కేంద్రం, ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై భారాలు తగ్గిస్తుంటే, ఏపీలో ఒక్కసారి కూడా తగ్గించకుండా మరింతగా పన్నులు పెంచిన సర్కారు తక్షణమే తగ్గించాలి.
ముఖ్యమంత్రివర్యా!
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి చందంగా ఉంది మీ తీరు. నిత్యావసరాలు ధరలు పెంచి, రకరకాల కొత్త పన్నులు విధించి. ఉన్న పాతపన్నులని రెట్టింపు చేసి, అన్ని చార్జీలు అమాంతంగా పెంచేసి సామాన్యుల బతుకు దుర్భరం చేశారు. మీ బాదుడే బాదుడు దెబ్బకి జనాలు అల్లాడిపోతుంటే, చిద్విలాసంగా నవ్వుతూ మీకు మీరే మీ పాలన బాగుందని సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. మీ పాలన చాలా చాలా చాలా ఘోరంగా వుందని గడప గడపకీ వెళ్తోన్న మీ నేతల మొహం మీదే ప్రజలు ఛీకొట్టి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పెట్రోల్ డీజిల్ లపై పన్నులు తగ్గించి ఆ మేరకు వాటి ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకుంది. కేంద్రంతోపాటు 23 రాష్ట్రాలు కూడా తాము వేస్తోన్న పన్నులని తగ్గించుకుని ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగిస్తే, మీ నుంచి స్పందన శూన్యం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు సరికదా, పెంచుకుంటే తప్పేంటంటూ కోట్ల రూపాయలతో దొంగ లెక్కలతో సొంత పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకోవడం మీకే చెల్లింది. చంద్రబాబు గారు సీఎంగా వున్నప్పుడు పన్నులు తగ్గించి ఆమేరకు పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించినా, ప్రతిపక్షనేతగా మీరు పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేయడం న్యాయం. కేంద్రం, ఇతర రాష్ట్రాలు తగ్గిస్తే, మీరు మాత్రం పెంచేస్తారు, అదే విషయం ప్రతిపక్షంగా మేము అడిగితే అన్యాయం.. ఇదేం నీతి సీఎం గారూ! టిడిపి హయాంలో ప్రజల పై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించాం. మీరు మూడేళ్లలో ఒక్క పైసా తగ్గించడం మాట అటుంచి పెంచుకుంటూ పోయారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పెట్రోల్పై మీ సర్కారే 31 శాతం వ్యాట్ విధిస్తున్నారు. దీనికి తోడు అదనపు వ్యాట్ అంటూ లీటర్ పెట్రోల్ఫై 4 రూపాయలు. రోడ్డు సెస్ 1 రూపాయి వేసి దేశంలోనే అతి ఎక్కువగా పెట్రోల్ ధర ఏపీలోనే అమ్ముతూ సామాన్యప్రజల్ని దోచుకుంటున్నారు.
కేంద్రం రెండుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భాలలో పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలూ తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుని ప్రజలకి మేలు చేస్తే, మీరెందుకు ప్రజల్ని మరింత భారాలు వేస్తున్నారో సమాధానం ఇవ్వాలి. కేంద్రం తాజాగా లీటరు పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా లీటర్ పెట్రోల్ రూ.9.50, డీజిల్ రూ.7 వరకూ తగ్గనుంది. అటు కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే కేరళ ప్రభుత్వం తాము లీటర్ పెట్రోల్పై రూ.2.41, డీజిల్పై రూ.1.36, రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్పై 2.48 రూపాయలు, డీజిల్పై 1.16 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీపావళికి ముందు కూడా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవడంతో లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఉపశమనం కలిగించిన కేంద్రం, రాష్ట్రాలూ కూడా తమ పన్నులని తగ్గించుకోవాలని సూచించింది. ఈ పిలుపునకు స్పందించి 23 రాష్ట్రాలూ పన్నులని తగ్గించుకుని ప్రజలపై ఇంధన ధరల భారాన్ని కాస్తా దింపాయి. ఒక్క ఏపీలో మాత్రమే ఒక్క పైసా కూడా తగ్గకుండా, అప్పటికే విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్ పన్నులని పెంచుకోనివ్వడంలేదంటూ ఏడుస్తూ కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో సీఎం పత్రికకి కట్టబెట్టడం ప్రజల్ని, ప్రజాధనాన్ని బందిపోటులా దోచుకోవడం కిందకే వస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా వుండటంతో అక్కడికి వెళ్లి తమ వాహనాలు ఫుల్ ట్యాంకులు చేసుకుని వస్తున్నారంటే, ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అతి ఎక్కువ చేసిన మీ దోపిడీ వల్ల, రవాణారంగంపై ఆధారపడిన అన్నిరంగాలూ తీవ్రనష్టాల్లోకి వెళ్లాయి. పన్నులు రూపంలో పెట్రోల్ డీజిల్పైనా ప్రజల్ని దోచుకోవాలనే మీ దురాశతో నిత్యావసరాలు ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా మానవతా ధృక్పథంతో ప్రజలపై బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాలని కోరుతున్నాను. పెట్రోల్ డీజిల్పై ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు అధికంగా వసూలు చేస్తోన్న అదనపు వ్యాట్, రోడ్ ట్యాక్స్లను తగ్గించుకుని, ప్రజలకు కాస్తయినా ధరాభారాల నుంచి ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు
నారా లోకేష్,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.