జగన్ సర్కార్ చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా: లోకేష్ ఆగ్రహం
తాము చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా వైఎస్ జగన్ సర్కారు వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మీడియా స్వేచ్చను హరించేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇప్పటికే పలు జీవోల ద్వారా ఆ పని చేసిన సీఎం ఇప్పుడు జర్నలిస్టులకు వున్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ ను కూడా పీకేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
''చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా వైఎస్ జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారు'' అంటూ ట్విట్టర్ వేదికన ఆరోపించారు లోకేష్.
''అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి... మిగిలిన జర్నలిస్టులందరి మొండిచేయి చూపడం చాలా దారుణం. అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కు. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది'' అని తెలిపారు నారా లోకేష్.