టీడీపీ ఓటమిపై నారా లోకేష్ స్పందన ఇదీ....
మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, అందరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే తన మాట మారదని అన్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై చంద్రబాబు నాయుడి తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆదివారం ఆయన వరుస ట్వీట్లతో కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం వచనాలు చెప్పారు. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు.
మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, అందరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే తన మాట మారదని అన్నారు. "అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని" అని కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవని, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధం మారదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తన ఇల్లు అని, అక్కడి ప్రజలంతా నా కుటుంబమని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదని, గడప గడపకు వెళ్లానని, గెలిచినా ఓడినా వారితోనే ఉంటానని స్పష్టం చేశారు.