మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలే కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలే కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ సొంత కుటుంబ సభ్యులను, పార్టీ నాయకులను మింగేస్తున్నారని విమర్శలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ సొంత చెల్లే రహస్య సాక్షిగా మారిందని చెప్పుకొచ్చారు. అయితే వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో జగన్కు ఎంతో సహకరించే కేసీఆర్కే ఆయన టోపీ పెట్టారని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇరికించేలా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చి బలి ఇచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో టాక్ వినిపిస్తుందని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు.
‘‘వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వాళ్లు.. ‘రా అవినాష్, రా జగన్’ అని పిలుస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పుకోవడానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని జగన్ బలి చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చి వివేకా హత్య కేసును వీక్ చేయించాడు. 2019 ఎన్నికల్లో ఆయనకు సహకరించిన కేసీఆర్కు కూడా జగన్ టోపీ పెట్టాడు. అవినాష్ రెడ్డిని, భారతి రెడ్డిలను కాపాడేందుకు కేసీఆర్ కూతురు కవితను బలి చేశాడని ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది’’ అని అన్నారు. అయితే సీఎం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసిన అవినాష్ రెడ్డిని, భారతీ రెడ్డిలను కాపాడలేడని అన్నారు.
‘‘స్పెషల్ స్టేటస్ వచ్చిందంటూ కొందరు మనవాళ్లు నాకు చెప్పారు. తీరా చూస్తే వివేకా హత్య కేసులో జైలులో ఉన్న వైఎస్ భాస్కర్రెడ్డికి ప్రత్యేక హోదా వచ్చిందంట. చంచల్గూడ జైలులో భాస్కర్రెడ్డికి స్పెషల్ ఖైదీగా స్పెషల్ స్టేటస్ ఇచ్చారట’’ అని నారా లోకేష్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఉక్కు కర్మాగారం స్థాపన, అన్నమయ్య డ్యామ్ బాధితుల సమస్యలపై ఇప్పటి వరకు పట్టించుకోని సీఎం జగన్కు కడప ప్రజలపై ఎలాంటి అభిమానం లేదని అన్నారు.