తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ ఆ పార్టీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరసన దీక్షలు చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ ఆ పార్టీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరసన దీక్షలు చేపట్టారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో టీడీపీశ్రేణులు నిరసన దీక్షలకు దిగారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కూడా నిరసన దీక్ష చేపట్టారు. ఇక, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలోని క్వారీ సెంటర్ వద్ద నిరసన దీక్షకు దిగారు. సత్యమేవ జయతే పేరుతో తలపెట్టిన నిరహార దీక్షకు వెళ్ళే ముందు భువనేశ్వరి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
‘‘తెలుగు జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానటుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ఈరోజు నా హృదయం నిండిపోయింది. సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ దానికి కట్టుబడి ఉండాలని ఆయన మనకు బోధించాడు. న్యాయం కోసం ఆయన బలమైన మద్దతు, తెలుగు ప్రజలకు సేవ చేయడంలో ఆయన అంకితభావం ఆయన పిల్లలైన మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది’’ అని భువనేశ్వరి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
చంద్రబాబు కొడుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగారు. లోధీ ఎస్టేట్లోని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేష్ దీక్ష చేపట్టారు. టీడీపీ ఎంపీలు, పలువురు పార్టీ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ‘‘సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన నేడు.. నిరాహార దీక్ష చేసి చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతున్నాను. సత్యమేవ జయతే’’ అని లోకేష్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
మరోవైపు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇక, ఏపీలోని మంగళగిరిలో టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. మంగళగిరి మెయిన్రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన సత్యమేవ జయతే దీక్ష కొనసాగుతుంది. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. మహాత్మాగాంధీ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. సత్యమేవ జయతే దీక్షలోఅచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరిఫ్, కొమ్మారెడ్డి పట్టాభిరాంతో పాటు పలువురు నాయకులు కూర్చొన్నారు.