నంద్యాల జిల్లాలో ని ఆత్మకూరు నుంచి ఓ మైనర్ బాలికను ఆళ్లగడ్డ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు బాలికను తీసుకెళ్లిన విధానంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

నంద్యాల జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు.. ఆత్మకూరు మండలం సిద్ధాపురంకు చెందిన ఓ మైనర్ బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారు బాలికను తీసుకెళ్లిన విధానం వివాదం నెలకొంది. వివరాలు.. బాలికను ఓ కేసులో అనుమానితురాలిగా భావించిన ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను ఆత్మకూరు నుంచి తీసుకెళ్లారు. ఇద్దరు కానిస్టేబుల్స్ బాలిక ఆటోలో వెళ్తుండగా అడ్డగించి.. బైక్‌పై తీసుకెళ్లారు. ఇద్దరు మగ పోలీసులు బైక్‌పై బాలికను వారి మధ్యలో కూర్చొబెట్టి తీసుకెళ్లారు. 

మరోవైపు ఈ విషయంలో తమకు సమాచారం లేదని స్థానిక ఆత్మకూరు పోలీసులు చెబుతున్నారు. స్థానిక పీఎస్‌కు సమాచారం లేదని ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఇక, పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.