అందుకే షర్మిలను తెరపైకి తెచ్చారు: నక్కా
తెలంగాణలో జగన్ దొరల కాళ్లు మొక్కుతున్నారని, వారికి కొత్త యాక్టర్ ఓవైసీ తోడయ్యారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ఎపికి చుట్టపు చూపుగా వచ్చే జగన్ తో కేసీఆర్ వచ్చి ఏం చర్చలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: ఫింఛన్ల పెంపును పక్కదారి పట్టించేందుకే షర్మిలను తెరపైకి తెచ్చారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త డ్రామా ప్రారంభించారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
తెలంగాణలో జగన్ దొరల కాళ్లు మొక్కుతున్నారని, వారికి కొత్త యాక్టర్ ఓవైసీ తోడయ్యారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ఎపికి చుట్టపు చూపుగా వచ్చే జగన్ తో కేసీఆర్ వచ్చి ఏం చర్చలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించినప్పుడు మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ ఎంపీలు బయటకు వెళ్లిపోయారని ఆయన అన్నారు.
పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఎపికి టీఆర్ఎస్ నేతలు ఏం మేలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బిజెపి వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శిం్చారు.
కేటీఆర్-జగన్ భేటీపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదు..మోదీ చేతిలో కీలుబొమ్మల ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మోడీకి ఓట్లను మూటకట్టడమే కేటీఆర్-జగన్ భేటీలో కుతంత్రమని విమర్శించారు.
మోడీ డైరక్షన్లోనే కేటీఆర్-జగన్ భేటీ అయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తున్నాయని, దానిని అడ్డుకునేందుకే ఫ్రంట్ ఎత్తుగడ అని యనమల అన్నారు. ఏపీకి అన్యాయం చేసినవాళ్లంతా ఒకచోట చేరుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, వైసీపీ రహస్య బంధంపై టీడీపీ చెప్పిందే నిజమైందని ఆయన అన్నారు.