కాంగ్రెస్కు షాక్: జనసేనలోకి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో దె్బ్బ తగిలింది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో దె్బ్బ తగిలింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో స్పీకర్గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ గురువారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరనున్నారు.
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. గురువారం నాడు సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో నాదెండ్ల మనోహర్ ఆ పార్టీలో చేరనున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్టచివరి స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడే నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో మనోహర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పార్టీ ప్రకటించిన కమిటీల్లో మనోహర్ కు ఎఐసీసీలో స్థానం దక్కలేదు. ఇది కూడ ఒక కారణంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు తన భావాలు ఒకే రకంగా ఉంటాయని మనోహర్ అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై పవన్ కళ్యాణ్తో మనోహర్ చర్చించినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ సాయంత్రానికి తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం మనోహర్ జనసేనలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.