Asianet News TeluguAsianet News Telugu

వెన్నుపోటు పొడిచే వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా : డీఎల్ రవీంద్రా రెడ్డికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కౌంటర్

వెన్నుపోటు పొడిచే డీఎల్‌ రవీంద్రా రెడ్డిని ఎవ్వరూ నమ్మరని వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. ఆరు ఎకరాలు వున్న ఆయన రూ.700 కోట్లు ఎలా సంపాదించారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

mydukur mla raghurami reddy counter to ex minister dl ravindra reddy
Author
First Published Dec 21, 2022, 7:14 PM IST

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు పొడిచే డీఎల్‌ను ఎవ్వరూ నమ్మరని వ్యాఖ్యానించారు. నమ్మిన వారిని వెన్నుపోటు పొడవటం డీఎల్‌కు అలవాటేనంటూ రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి రమ్మని రవీంద్రా రెడ్డిని తాము పిలవలేదని... ఖాజీపేట, బీ మఠంలలో కాలేజీలు పెట్టుకుని ఆయన వ్యాపారం చేస్తున్నారని రఘురామిరెడ్డి ఆరోపించారు. ఆరు ఎకరాలు వున్న ఆయన రూ.700 కోట్లు ఎలా సంపాదించారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

అంతకుముందు బుధవారం ఉదయం కడపలో డీఎల్ రవీంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సీఎం అయిన నాటి నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 

Also REad: వైసీపీకి సింగిల్ డిజిట్ కష్టమే.. పవన్‌కు అనుభవం లేదు, చంద్రబాబు అయితేనే : డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

వైసీపీలో వున్నందుకు అసహ్యంగా వుందన్నారు. తాను ఇంకా వైసీపీలోనే వున్నానని.. వారేమీ తనను తప్పించలేదని డీఎల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా కేసులో సుప్రీం తీర్పు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసించారు. 

కాగా.. కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు. టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా వుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే 2019లో వైసీపీకి జై కొట్టిన డీఎల్‌కు జగన్ సరైన గుర్తింపునివ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios