రౌడీషీటర్ పై ఇద్దరు వ్యక్తులు  కత్తులతో దాడిచేసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

మచిలీపట్నం : కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగుల ఓ రౌడీ షీటర్ ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రౌడీషీటర్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 

పెడన నియోజకవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన పంతం బలరాం రౌడీషీటర్. పాతకక్షల నేపథ్యంలో అతడిపై యర్రా దేవ, యర్రా జీవన్ అనే ఇద్దరు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బలరాం ఒంటరిగా వుండగా ఒక్కసారిగా కత్తులతో దాడికిదిగి తేరుకునేలోపే తీవ్రంగా గాయపర్చి పరారయ్యారు. కత్తిపోట్లతో రక్తపుమడుగులో కుప్పకూలిన బలరాంను హుటాహుటిన మచిలీపట్నం హాస్పిటల్ కు తరలించారు. 

మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న బలరాంను మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు పరామర్శించారు. బలరాం ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు వైసిపి యువ నాయకుడు కిట్టు. బలరాంకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు కిట్టు. 

వీడియో

రౌడీషీటర్ బలరాంపై హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బలరాంపై దాడిచేసిన ఇద్దరు నిందితులు పరారీలో వున్నారని... వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.