మరో 25ఏళ్లు జగనే సీఎం... మనందరి లక్ష్యమదే: వైసిపి శ్రేణులకు విజయసాయి పిలుపు (వీడియో)
విశాఖపట్నం వైసిపి కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఎంపి విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరో 25 ఏళ్ల పాటు సీఎంగా చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పని చెయ్యాలని వైసిపి శ్రేణులకు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విశాఖలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నగర వైసీపీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో విజయసాయి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం జగన్ తనను చూసుకోమన్నారు కాబట్టే చూసుకుంటున్నా అన్నారు. విశాఖ ప్రజలకు సేవ చేయటమే నా ఉద్దేశమన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా భూ ఆక్రమణలు, పంచాయితీలు చేస్తే ఊరుకోబోనని అన్నారు. ఇలాంటివి ఎక్కడైన జరిగితే తనకు ఫోన్ చేయాలని... వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
వీడియో
"
''ప్రజలందరికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయననే మెంటార్ గా, గైడ్ గా అనుసరిస్తామని చెప్పాం కాబట్టే మన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేశాం మనల్ని ఎవరు ప్రశ్నించరు అనుకుంటే ప్రజలు హర్షించరు'' అని హెచ్చరించారు.
''పార్టీలో ఎవరికైనా న్యాయం చేయలేదు, గుర్తించలేదు అనుకుంటే భవిష్యత్ లో వారికి న్యాయం చేస్తాం. ప్రజాభీష్టానికి తగ్గట్టు పాలన చేయాలని విశాఖ మేయర్, కార్పొరేటర్లకు తెలియజేస్తున్నా. మనమంతా కలిసి విశాఖను అభివృద్ది చేసుకోవాలి'' అని విజయసాయి సూచించారు.