తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జనప్రభంజనం కనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తమ పార్టీ భవిష్యత్ ముఖచిత్రం తనకు కనిపిస్తోందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జనప్రభంజనం కనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆరు గంటలు ఆలస్యమైనా చంద్రబాబు కోసం జనం వెయిట్ చేశారని అన్నారు. తమ పార్టీ (వైసీపీ) భవిష్యత్ ముఖచిత్రం తనకు కనిపిస్తోందని చెప్పారు. వై నాట్ 175 అని జగన్ మోహన్ స్లోగన్ ఇస్తున్నారని.. కానీ వై నాట్ 175 ప్రతిపక్షానికి అని తనకు అనిపిస్తోందని చెప్పారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా బయటపడుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు సభలకు భారీగా జనం వస్తున్నారని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు మీద లైట్లు ఆపి రాళ్లేశారని.. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు కూడా లైట్లు ఆపేశారని అన్నారు. మరి ఏం చేద్దామని అనుకున్నారో తెలియదని అన్నారు. ఎవరైనా రెక్కీ, రాళ్లు వారిపైన వారే వేసుకుంటారా? అని ప్రశ్నించారు. రేపు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయదా అని ప్రశ్నించారు. అందరూ మన కోడికత్తి లాగా డ్రామాలు చేసేస్తారా? అని ప్రశ్నించారు. చిన్నాయన హత్య, కోడికత్తి మీదే కదా వైసీపీ ఎన్నికల్లో నెగ్గింది అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పథకం ప్రకారం తమ వాళ్లు అరెస్ట్ చేస్తారని.. ఈ అక్రమ అరెస్ట్‌లు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. మంత్రి జోగి రమేష్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వగలిగితే ఇవ్వాలని.. లేకపోతే చెత్త చెత్త మాటలు ఎందుకని ప్రశ్నించారు. లేదంటే నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అన్నారు. మనం ఒకటి మాట్లాడితే.. జనం పది మాట్లాడతారని.. మన ట్రాక్ రికార్డు అలాంటిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.