భారత పార్లమెంట్లో వైసీపీకి దక్కిన అరుదైన గౌరవం.. మార్గాని భరత్ ట్వీట్ వైరల్
పార్లమెంట్లో లోక్సభ ప్యానెల్ స్పీకర్గా పెద్దిరెద్ది మిథున్ రెడ్డి.. రాజ్యసభ ప్యానెల్ ఛైర్మన్గా విజయసాయిరెడ్డిలు నియమితులైన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫోటోలు షేర్ చేశారు.
పార్లమెంట్లో వైసీపీకి అరుదైన గౌరవం దక్కింది. లోక్సభ ప్యానెల్ స్పీకర్గా పెద్దిరెద్ది మిథున్ రెడ్డి.. రాజ్యసభ ప్యానెల్ ఛైర్మన్గా విజయసాయిరెడ్డిలు నియమితులైన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ మార్గాని భరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. సభాధిపతి స్థానంలో మిథున్ రెడ్డి , విజయసాయిరెడ్డిలు వున్న ఫోటోలను భరత్ షేర్ చేశారు.
ఇకపోతే.. విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు.
'ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఎన్నో కేసుల్లో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ, భారతదేశంలో A2 గా గుర్తించబడిన విజయసాయి రెడ్డి, నిన్న రాజ్యసభకు అధ్యక్షత వహించి సభను నడిపించారట! ఇంతటి నేర చరిత్రను కలిగిన వ్యక్తి, అంతటి రాజ్యసభకు అధ్యక్షత వహించడం విడ్డూరం కదూ? పెద్దల సభకు అవమానం కదూ?' అని విమర్శించారు.
మరోవైపు రాజ్యసభను కొద్దిసేపు నడిపించడంపై విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడిని ఉండేవాడినని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందన్నారు. సీఎం వైఎస్ జగన్, భారతీ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందన్నారు.