నేను టీడీపీలో చేరతానని దేవినేని ఉమా భయపడుతున్నాడు.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని దేవినేని ఉమా భయపడుతున్నారని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా టార్గెట్గా విమర్శలు గుప్పించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని దేవినేని ఉమా భయపడుతున్నారని అన్నారు. తాను టీడీపీలో చేరితే ఆయన సీటుకు ఎసరొస్తుందని భయం పట్టుకుందని అన్నారు. తనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టించాలని దేవినేని ఉమా చూస్తున్నారని చెప్పారు. తన జోలికి రానిదే తాను ఎవరి జోలికి వెళ్లనని అన్నారు. మంత్రి జోగి రమేష్తో తనకు చిన్న విభేదాలు ఉన్నాయని.. వాటిని దేవినేని ఉమా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
తాను పదవులకు లొంగేవాడిని కాదని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటికి పిలిపిస్తే నమస్కారం పెట్టి వచ్చేశానని చెప్పారు. ఆయన తనను గౌరవించారని.. తాను కూడా ఆయనను గౌరవించానని తెలిపారు. అకారణంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను తిట్టాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. తాను దేవినేని ఉమాను మాత్రమే తిడతానని అన్నారు. దేవినేని ఉమా తనను ఏమి అనకపోతే.. తాను కూడా ఆయనను ఏమి అననని అన్నారు. దేవినేని ఉమాను ఇంట్లో అందరవి ఆడవాళ్ల పేర్లేనని చెప్పారు.