వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జీగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.. మీడియాలో కథనాలు: ఆనం స్పందన ఇదే
వెంకటగిరి ఇన్ఛార్జీగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని జగన్ నియమిస్తారంటూ వస్తోన్న కథనాలపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి . దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తనపై మీడియాలో వస్తున్న కథనాలపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వెంకటగిరి ఇన్ఛార్జ్గా రామ్కుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు సమాచారం లేదన్నారు. పార్టీ నుంచి తనతో ఎవరూ మాట్లాడలేదని ఆనం పేర్కొన్నారు. ఊహాగానాలపై తాను స్పందించనని, ఏం జరుగుతుందో వేచి చూస్తానని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. గత కొంతకాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిలో భాగంగా ఆయనపై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వెంకటగిరి ఇన్ఛార్జ్గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం వుంది. ఆనం కామెంట్లు పార్టీకి నష్టం కలిగించేలా వున్నాయని అధిష్టానం అభిప్రాయపడింది. ఇటీవల ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆనం తీవ్రవ్యాఖ్యలు చేశారు. గోతులు పడ్డ రోడ్లను బాగుచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.