కారణమిదే: మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య
మైనర్లైనా ప్రేమంటూ తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఆ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.
అనంతపురం: మైనర్లైనా ప్రేమంటూ తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఆ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పాల్వాయి గ్రామంలో మైనర్ ప్రేమ జంట శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదివారం నాడు ఉదయం స్థానికులు మృతి చెందిన ప్రేమ జంటను గుర్తించారు.
పాల్వాయి గ్రామానికి చెందిన వన్నూరమ్మ అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ లోకేష్లు ప్రేమించుకొంటున్నారు. వన్నూరమ్మ టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆమెను స్కూల్ మాన్పించారు.
వన్నూరమ్మను స్కూల్ మాన్పించినా కూడ లోకేష్ను కలవడం మాత్రం మానలేదు. ఈ విషయాన్ని గుర్తించిన వన్నూరమ్మ తల్లిదండ్రులు ఆమెను శనివారం నాడు మందలించారు. దీంతో శనివారం రాత్రి పూట వన్నూరమ్మ ఇంటి నుండి బయటకు వెళ్లింది. లోకేష్ కూడ ఇంటి నుండి వెళ్లి పోయాడు.
వీరిద్దరూ గ్రామానికి సమీపంలోని ఆలయం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోయారు. ఇద్దరూ కూడ ఇళ్లలో లేరని గుర్తించిన రెండు కుటుంబాల వారు అర్ధరాత్రి గాలించారు.
ఇవాళ ఉదయం గ్రామానికి సమీపంలోని చెట్టుకు వీరిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.వీరిద్దరూ కూడ ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.