విశాఖపట్నంలోని రుషికొండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు  ప్రచారం చేస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. బోడి వెధవలు అంతా కూడా బోడి ప్రచారం చేయడం ప్యాషన్‌గా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

విశాఖపట్నంలోని రుషికొండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. బోడి వెధవలు అంతా కూడా బోడి ప్రచారం చేయడం ప్యాషన్‌గా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రుషికొండ వద్ద హడావుడి చేశాడని.. అక్కడ ఏం లోపాలు ఉన్నాయో, ఏం అక్రమాలు జరుగుతున్నాయో చెప్పమంటే మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. జనసేన, టీడీపీ, రఘురామకృష్ణరాజులు దీనిపై కోర్టుకు వెళ్లారని.. ఎక్కడైనా ఇది అక్రమ కట్టడమని గానీ, నిర్మాణాన్ని ఆపేయండని గానీ కోర్టు తీర్పు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఎన్జీటీ ఇచ్చిన స్టేను కూడా సుప్రీం కోర్టు ఎత్తివేసిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా సుప్రీం కోర్టు కన్నా గొప్పొడా అని ప్రశ్నించారు. 

ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉందని.. అక్కడ చేసేనిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ద్వారా అందజేస్తుందని చెప్పారు. కోర్టు చిన్న చిన్న మార్పులు సూచిస్తే వాటిని పాటిస్తున్నామని తెలిపారు. అలాంటిది పవన్‌కు వచ్చిన బాధేమిటని ప్రశ్నించారు. అక్కడ పాతగా అయిపోయిన ప్రభుత్వ కట్టడాలను ప్రభుత్వం అభివృద్ది చేస్తుంటే.. పవన్‌కు ఏం బాధ అని సమాధానం చెప్పారు. 

కొండల మీద కట్టడం వల్ల పర్యావరణం ధ్వంసం అవుతుందని పవన్ భావిస్తే.. రుషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయని అన్నారు. ఇంకా అనేక నిర్మాణాలు కొండల మీదనే ఉన్నాయని చెప్పారు. కొండ మీద ఈ కట్టడాలు పవన్‌కు కనిపించడం లేదా?.. ఆయన కళ్లు ఏమైనా కల్యాణ్ జూవెల్లర్స్‌లో తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాన్ మాట్లాడినట్టుగా కొండల మీద కట్టడం తప్పే అయితే.. ఆయనది, ఆయన అన్నయ్యది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ కొండల మీదే ఉంది కదా? అని అన్నారు. వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా.. మరి వాటి గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

పవన్ దత్త తండ్రి చంద్రబాబు.. మూడు పంటలు పండే 33 వేల ఎకరాలు బలవంతంగా లాక్కొని.. కాంక్రీట్ జంగిల్‌ చేస్తుంటే.. ఆ రోజు పవన్ నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ఏమైనా పెట్టుకున్నాడా? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సింహచలం ఆలయం, తిరుమల ఆలయం.. కొండల మీదే ఉన్నాయని.. అక్కడ కూడా కట్టడాలు ఉన్నాయని అన్నారు. కొండల మీద కట్టడాలు ఉండకూడదనే అజ్ఞానంగా మాట్లాడటం చూస్తే.. ఆయన ప్యాకేజ్ స్టార్ అని మరోసారి అర్థమైందని చెప్పుకొచ్చారు. 
పవన్‌కు గీతం యూనివర్సిటీ చేసిన కబ్జా కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ హరిత రిసార్ట్స్ ఉన్నచోట.. పాడుబడిందని కేపిటల్ సిటీ వస్తుందని బాగు చేయాలని చూస్తుంటే.. కక్షగట్టి విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని వైజాగ్ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు సహించరని.. వారిని తరిమి కొట్టడం ఖాయమని అన్నారు. 

అన్ని అనుమతులతోనే రుషికొండపై నిర్మాణాలు చేపడుతున్నామని రోజా తెలిపారు. ‘‘జగన్ ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడని మాట్లాడుతున్నాడు.. నువ్వెవడివి, నువ్వు ఎవడివిరా’’ అంటూ రోజా తీవ్ర పదజాలంతో విమర్శించారు. చంద్రబాబు, పవన్‌లు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులని విమర్శించారు. సీఎం జగన్ ఒక్కసారి కళ్లు గట్టిగా తెరిచి చూస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు. అలాంటి పనులు జగన్ చేయడు కాబట్టే.. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ ఎమ్మెల్యే కాలేదని.. పార్టీ ఒక్కడు కూడా లేడని.. అలాంటిది ఎలా ప్రతిపక్ష నాయకుడివి అని చెప్పుకుంటావని ప్రశ్నించారు. 


జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సొంత డబ్బులతో తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అక్కడే నాలుగుళ్లుగా ఉంటున్నారు. అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబును తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు అన్నింటినీ అభివృద్ది చేసుకోవడానికి రూ. 50 కోట్లు ఖర్చు చేశాడని విమర్శించారు. మొత్తంగా చంద్రబాబు తన ఇళ్లకు, ఉండే గెస్ట్‌హౌస్‌లకు దాదాపుగా రూ. 187.58 కోట్లు ఖర్చు పెట్టుకుంటే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. కానీ సొంత డబ్బులతో ఇళ్లు కట్టుకున్న జగన్‌ను మాత్రం ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పవన్ బానిస అంటూ విమర్శించారు. విశాఖను దోచుకుంది టీడీపీనేనని ఆరోపించారు. అదే విషయాన్ని ఆనాడూ మంత్రిగా అయ్యన్నపాత్రుడే చెప్పడం జరిగిందని అన్నారు. దోచుకున్న వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు.