తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చిన వైసీపీ ఓడించలేరని అన్నారు. 

మాచర్ల: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చిన వైసీపీ ఓడించలేరని అన్నారు. మంచి పరిపాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఒక్క సీఎం జగన్‌కే ఉందని చెప్పారు. సీఎం జగన్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. మాచర్లలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేల పోటీలను మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌‌లతో కలిసి రోజా ప్రారంభించారు. 

అనంతరం అక్కడ రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టీడీపీ ,జనసేనలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీర సైనికుడని.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తుచేశారు. 


తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా పార్లమెంట్‌కు తనను పిలిచి చంద్రబాబు అవమానించారని మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. పోలీసులు ఇదే మాచర్లలో అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్‌లో వదిలేశారని అన్నారు. అలాంటిది టీడీపీ వాళ్లు కుళ్లుకునే విధంగా.. అదే పోలీసుల సెక్యూరిటీతో మాచర్లకు వచ్చే విధంగా సీఎం జగన్ తనను మంత్రిగా చేశారని అన్నారు.