చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి.. మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు : మంత్రి పెద్దిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పండగ పూట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పండగ పూట రాజకీయం చేస్తున్నారని, మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఆదరణ లేకుండా పోతుందనే భయంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఏదో ఒక నెపంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు ఏడుస్తుంటారని.. అప్పుడప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు తనపై ఏడుస్తుంటాడని మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ సారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తామని అన్నారు.
2019 నుంచే ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలాడిన టీడీపీకి భవిష్యత్ ఉండదని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టారీతినా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.