మోదీకి పవన్ దత్తపుత్రుడు..జగన్ అవినీతి పుత్రుడు:లోకేష్ ఫైర్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లపై ఏపీ మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ధర్మపోరాటం సభలో పాల్గొన్న లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని అవినీతి పుత్రుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
తాడేపల్లిగూడెం: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లపై ఏపీ మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ధర్మపోరాటం సభలో పాల్గొన్న లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని అవినీతి పుత్రుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ప్రజలు చుక్కలు చూపిస్తారంటూ ధ్వజమెత్తారు. బీజేపీని పవన్, జగన్ లు ఒక్క మాట కూడా అనడం లేదని మండిపడ్డారు.
కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి నామం పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. పవన్, జగన్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి హోదా, రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్రమేనని అయినా మొండి చేయి చూపారన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు.
అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయేనని లోకేష్ అభిప్రాయపడ్డారు.