చంద్రబాబు దళిత ద్రోహి, గజ దొంగ .. ఆ 29 చోట్లా టీడీపీ ఓటమి ఖాయం : మేరుగ నాగార్జున వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున . దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అని చంద్రబాబు గతంలో అవహేళన చేశారని మేరుగ నాగార్జున గుర్తుచేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుందన్నారు. చంద్రబాబు గజదొంగ అని ఆయన రాజకీయాల్లో వుండటానికి అనర్హుడని మంత్రి పేర్కొన్నారు. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం వుందా అని నాగార్జున ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల ఖాతాలో నేరుగా జగన్ వేశారని.. చంద్రబాబు దళిత ద్రోహి అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అని చంద్రబాబు గతంలో అవహేళన చేశారని మేరుగ నాగార్జున గుర్తుచేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ముందు ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించాలని సవాల్ చేశారు . దళితులకు ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారని.. అందుకే 29 దళిత నియోజకవర్గాల్లో , 28 చోట్ల టీడీపీ అభ్యర్ధులు ఓడిపోయారని మేరుగ నాగార్జున చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో ఆ 29 నియోజకవర్గాల్లోనూ టీడీపీకి ఓటమి తప్పదంటూ మంత్రి జోస్యం చెప్పారు.
Also Read: దళితుల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? : జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు
అంతకుముందు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో వుండగా ఏం చేయలేదని రోజా దుయ్యబట్టారు. ఒక్క జిల్లాకు కానీ మండలానికి కానీ ఎన్టీఆర్ పేరు పెట్టలేదని ఆమె ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీని లాక్కొన్నారని రోజా ఆరోపించారు. అసెంబ్లీలో కనీసం ఎన్టీఆర్ మైక్ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మంత్రి మండిపడ్డారు. ఇవన్నీ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం హాస్యాస్పదమన్నారు.
విపక్షంలో వున్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకి గుర్తొస్తారని .. అధికారంలోకి వచ్చాక వాళ్లని పట్టించుకోరని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డకు ఆయన పేరును పెట్టిన వ్యక్తి జగన్ అని మంత్రి ప్రశంసించారు. గతంలో మోడీని తిట్టి.. ఇప్పుడు అదే నోటితో ఆయనను చంద్రబాబు పొగుడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అవసరం కోసం ఏదైనా చేస్తారని.. జగన్ పథకాలను తానూ అమలు చేస్తానని చెప్పడం ద్వారా ఆయన పాలన బాగుందని ఒప్పుకున్నట్లేననని రోజా అన్నారు.