రాజీనామా యోచనలో మంత్రి కిడారి
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్... తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్... తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోవడంతో... ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ కి సీఎం చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 11వ తేదీన ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్కు సమాచారం అందించింది.
కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.