ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్‌గానే ఎదుర్కొంటామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్‌గానే ఎదుర్కొంటామని అన్నారు. ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసే విజయం సాధించామని చెప్పారు. గురువారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అని చెప్పారు. 

తాము గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. మూడు పార్టీలు కలిసినా, బీఆర్ఎస్‌ కలిసినా తాము ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాళా తీయించిందని ఆరోపించారు. రూ. 20 వేల కోట్ల అప్పులు చేసి.. వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని అన్నారు. తమ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చి.. పౌర సరఫరాల శాఖను మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పారు. 

ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామని తెలిపారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని.. వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని పేర్కొన్నారు.