అమరావతి ల్యాండ్ స్కాం .. ఆయన జీవితమంతా స్టేలు తెచ్చుకోవడమే : చంద్రబాబుపై మంత్రి కారుమూరి విమర్శలు
అమరావతి లాండ్ స్కామ్కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు జీవితం మొత్తం అవినీతిమయమని.. స్టేలు తెచ్చుకోవడమే ఆయన జీవితంగా వుందన్నారు.
అమరావతి లాండ్ స్కామ్కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి త్వరలోనే చంద్రబాబు అవినీతి బట్టబయలు అవుతుందన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం అవినీతిమయమని.. స్టేలు తెచ్చుకోవడమే ఆయన జీవితంగా వుందన్నారు. 1996లో రూ.350 కోట్ల స్కామ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని.. స్వయంగా మోడీ కూడా ఆయన అవినీతిపై ఆరోపణలు చేశారని కారుమూరి గుర్తుచేశారు.
రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక కట్టడాల పేరుతో రూ.11 వేల కోట్లను ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ చిన్నపాటి వర్షానికే అక్కడ లీకులు అవుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్నికల సమయంలో ఆయనను విపరీతంగా పొగుడుతూ వుంటారని మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి చంద్రబాబు ఎంతటి అవినీతిపరుడో చెప్పొచ్చన్నారు.
కాగా.. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అమరావతి భూముల కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించి జరిగిన అవినీతిపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై ఏపీ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్ట్ బుధవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందన్నారు. అమరావతి పేరు చెప్పి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కచ్చితంగా అరెస్టులు జరుగుతాయని సజ్జల జోస్యం చెప్పారు. టీడీపీ హయంలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్ర సంపదకు నష్టం కల్గించే కుట్రలను బయటకు తీస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనన్నారు. సిట్ దర్యాప్తులో మరిన్న విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ALso Read: అమరావతి ల్యాండ్ స్కాంలో అరెస్టులు తప్పవు: బాబు అవినీతిని బయటపెడతామన్న సజ్జల
గతంలో జరిగిన తప్పులపై సమీక్ష జరగాల్సిందేనన్నారు. అమరావతి ల్కాండ్ స్కాంపై సిట్ దర్యాప్తుపై చంద్రబాబు ఆయన ముఠా ఎందుకు భయపడిందని ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో తమ పాత్ర లేకపోతే దర్యాప్తు కోరవచ్చు కదా అని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సిట్ దర్యాప్తుపై స్టే కోరడమంటే అందులో ఏదో మతలబు ఉన్నట్టేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు. దేశంలోనే భూమికి సంబంధించిన అతి పెద్ద స్కాంగా దీనిని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఏస్టేట్ స్కామ్ కు రాజధాని అని పేరు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు.